‘వ్యవసాయ’ బదిలీల్లో రసాభాస

12 Jun, 2018 01:35 IST|Sakshi

ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

అర్ధాంతరంగా కౌన్సెలింగ్‌ వాయిదా...

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖలో బదిలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉద్యోగ సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బదిలీ కౌన్సెలింగ్‌ను మరో రోజుకు వాయిదా వేస్తూ వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలో బదిలీ ప్రక్రియ సోమవారం మొదలైంది. వ్యవసాయ శాఖ శిక్షణ కేంద్రంలో కమిషనర్‌ కౌన్సెలింగ్‌ చేపట్టా రు.

ఐదో జోన్‌కు చెందిన వ్యవసాయ ఉద్యోగులు, అధికారుల బదిలీ ప్రక్రియ నిర్వహించారు. జూనియర్, సీనియర్‌ అసిస్టెం ట్లు, సూపరింటెండెంట్ల బదిలీ ప్రశాంతంగానే ముగిసింది. ఆ తర్వాత సహాయ వ్యవసాయాధికారుల(ఏడీఏ) కౌన్సెలింగ్‌ను ప్రారంభించడంతో రెండు వ్యవసాయ సంఘాల మధ్య వివాదం నెలకొంది. తమకు అన్యాయం జరుగుతుందని వారు నిరసనకు దిగారు.

జీవోకు వ్యతిరేకంగా కమిషనర్‌ బదిలీలు చేపడుతున్నా రని ఓ సంఘం, నిబంధనల ప్రకారం చేస్తున్నా అతనికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మరో సంఘం ఆరోపించాయి. ఏడీఏ ల్లో ఏడెనిమిది మందికి అర్హత ఉన్నా పోస్టింగులు సరిగా ఇవ్వలేదని ఓ సంఘం ఆరోపించింది. మండల వ్యవసాయాధికారుల(ఏవో) బదిలీ ప్రక్రియలో 7 నుంచి పదేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులను బదిలీ చేయలేదని పలువురు ఆరోపించారు. ఉన్న ఉద్యోగుల్లో 40% బదిలీ చేయాల్సి ఉండగా, కట్‌ ఆఫ్‌ పరిధిని మించి బదిలీ చేస్తున్నారని మరో సంఘం ఆరోపించింది.  
నేడూ ఐదో జోన్‌ బదిలీలే...
ఐదో జోన్‌ బదిలీలు వాయిదా పడటంతో మంగళవారం అదే జోన్‌కు చెందిన ఏవోల బదిలీలు పూర్తిచేస్తామని వ్యవసాయశాఖ కమిషనర్‌ ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం జరగాల్సిన ఆరో జోన్‌ బదిలీలను బుధవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఐదో జోన్‌ ఏడీఏల బదిలీ ప్రక్రియ ముగిసిందని, అదే జోన్‌ ఏవో ల కౌన్సెలింగ్‌ నిర్వహణకు సమయం సరిపోకపోవడంతో వాయి దా వేశామన్నారు. నిబంధనల ప్రకారం కమిషనర్‌ బదిలీ కౌన్సెలింగ్‌ చేపట్టడం లేదని తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్‌ కృపాకర్‌రెడ్డి ఆరోపించారు. కాగా, కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు అన్నారు.

మరిన్ని వార్తలు