మహిళపై గ్యాంగ్ రేప్, హత్య

1 Sep, 2014 00:36 IST|Sakshi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య

సాక్షి, హైదరాబాద్ : గుర్తు తెలియని ఓ మహిళ(40)పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి, గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో నాలుగు గంటల్లోనే పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కూకట్‌పల్లి ఆర్‌ఎస్ బ్రదర్స్ బస్టాప్ పక్కనే నివాసముంటున్న రాజు చిత్తు కాగితాలు, ఇనుప సామానులు ఏరుకుని విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి రాజు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను తీసుకుని రాందేవ్‌రావు ఆసుపత్రి పక్కనున్న బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. తరువాత తన మరో ఇద్దరు స్నేహితులను అక్కడికి రప్పించాడు. ముగ్గురూ మద్యం సేవించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు విషయం బయటికి చెబుతుందనే భయంతో ఆ ముగ్గురూ కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్ సహాయంతో నిందితుడు రాజును పట్టుకున్నారు. పరారీలో ఉన్న అతని ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
 
 హ్యాట్సాఫ్ ‘రాఖీ’...
 
 ఉదయం ఆరు గంటలకు వెలుగు చూసిన కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్ ఘటన స్థలానికి సరిగ్గా 10 గంటలకు డాగ్‌స్క్వాడ్ బృందం చేరుకుంది. పోలీసు కుక్క రాఖీ ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ దూరం వరకు వెళ్లి జేఎన్‌టీయూ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ బస్టాప్ వద్దకు వచ్చి ఆగింది. అక్కడ మాసిన తల, బట్టలతో ఉన్న ఓ యువకుని పట్టుకుంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య మిస్టరీ వీడింది. కాగా గత ఏడాది నవంబర్ 30న ఏఎస్‌రావునగర్‌లో మహేష్ బ్యాంకు దోపిడీకి పాల్పడిన బ్యాంకు ఉద్యోగి బ్రహ్మచారిని కూడా రాఖీనే పట్టించింది. రెండు కీలక కేసుల్లో నిందితులను పట్టుకున్న రాఖీకి అందరూ హ్యాట్సాప్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు