మరో 127 మందికి పాజిటివ్
అధికంగా జీహెచ్ఎంసీలో 110 కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మరణాలు వంద దాటాయి. గురువారం ఒక్కరోజే ఆరుగురు మరణించడంతో మృతుల సంఖ్య 105కి పెరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మరో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,147కు చేరింది. గురువారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 110 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7, రంగారెడ్డి జిల్లాలో 6, మేడ్చల్ జిల్లాలో 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 1,587 మంది కోలుకోగా, మరో 1,455 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన 458 మందిలో ప్రస్తుతం 212 మంది చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా 206 మంది వలస కూలీలు కూడా చికిత్స పొందుతున్నారు.