వీరు కరోనాను జయించారు!

5 Apr, 2020 01:32 IST|Sakshi

15 మందికి ప్రాణదాతలుగా నిలిచిన వైద్యులు 

గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి.. 

గాంధీ ఆస్పత్రి: వీరు కరోనాను కలిసి జయించారు.. కంటికి కనిపించని శత్రువుపై పోరాడి విజయం సాధించారు.  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి వైద్యో నారాయణో హరిః అన్న నానుడిని నిజం చేశారు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు. గత కొన్నిరోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులను శనివారం ఉదయం సురక్షితంగా డిశ్చార్జి చేసి, వారి స్వస్ధలాలకు ప్రత్యేక అంబులెన్స్‌లలో పంపినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, కరోనా కోర్‌కమిటీ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ రాజారావు, నోడల్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డిలు ప్రకటించారు. డిశ్చార్జి సమయంలో బాధిత రోగులతో కలిసి ఫొటోలు దిగారు.

వైద్య సేవల అనంతరం సుమారు 15 మంది బాధితులు కోలుకున్నారు. రెండుసార్లు చేపట్టిన నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు రావడంతో శుక్రవారం రాత్రి వారిని డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత రోగులంతా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతోపాటు భద్రాచలం, నిజామాబాద్, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో ఉంచి, శనివారం ఉదయం ప్రత్యేక వాహనాలు, అంబులెన్స్‌లలో స్వస్ధలాలకు పంపారు. డిశ్చార్జి అయిన వారిలో ఇండోనేసియాకు చెందిన వారు కూడా ఉన్నారు.  

మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఈ మధ్యలో ఎటువంటి లక్షణాలు కనిపించినా సమాచారం అందించాలని కోరుతూ వారికి తగిన సలహాలు, సూచనలు అందించారు. డిశ్చార్జి చేసిన బాధిత రోగుల వివరాలను ప్రజారోగ్య విభాగానికి అందిస్తామని, ఆయా ప్రాంతాల్లో గల ప్రజారోగ్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్‌లో ఉన్నాడా లేదా అనేది పరిశీలించి నివేదిక అందిస్తారని గాంధీ వైద్యవర్గాలు వివరించాయి. 

మరిన్ని వార్తలు