కరోనా: ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం

4 Apr, 2020 11:46 IST|Sakshi
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలు

సర్వేకు సహకరించని కరోనా అనుమానిత కుటుంబాలు

వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన

పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి కుంటుంబాలను సర్వే చేసేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలపై దాడికి యత్నించడం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడంపై జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వేకు ప్రజలు సహకరించడం లేదని, దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని, గదుల్లో బంధిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (మృతులంతా మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లే..!)

చిల్కూరి లక్ష్మినగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్త భారతి శివాజీచౌక్‌లో సర్వేకు వెళ్లగా.. ఓ అనుమానితుడు సర్వే ఫైల్‌ను చించే ప్రయత్నం చేసి దాడికి యత్నించాడు. సదరు వ్యక్తిపై వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక శివాజీచౌక్‌కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని సర్వే చేసేందుకు ఆశా కార్యకర్త భారతి వెళ్లగా.. అతడి సోదరుడు దురుసుగా ప్రవర్తించాడు. భారతి ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్వయంగా కేసును పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని  ఆదేశించారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు)

ఖుర్షీద్‌నగర్‌ ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్త అర్చన ఖుర్షీద్‌నగర్‌లో సర్వేకు వెళ్లగా కొందరు స్థానికులు దురుసుగా ప్రవర్తించారు. ఇలా వరుస సంఘటనలో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తొడసం చెందు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ విష్ణు వారియర్‌ సర్వేకు వెళ్లే ఆశా కార్యకర్తలకు పోలీసు సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్వేలకు వచ్చిన ౖసిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (కరోనా: మరో షాకింగ్‌ న్యూస్‌!)

మరిన్ని వార్తలు