కరీంనగర్టౌన్ : కరోనా మహమ్మారి కరీంనగర్జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. ఇండోనేషియా, మర్కజ్, వలస కేసులను మినహాయిస్తే, ప్రాథమిక కాంటాక్టులు, ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య పెరుగుతోంది. అసలు వారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నగానే మిగులుతోంది. దీనంతటికీ దశలవారీగా కొనసాగుతున్న లాక్డౌన్ సడలింపులే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో సడలింపుల తర్వాతే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న కేసులు..
ఇండోనేషియన్లు, మర్కజ్ లింకులతో ఏప్రిల్ 16 వరకు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ సడలింపుల తరువాత వలస కార్మికులు రావడంతో చొప్పదండిలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఓ పాజిటివ్ వ్యక్తి తల్లికి సైతం కరోనా సోకింది. గంగాధరలో
ఓ ఏఎన్ఎంకు ట్రావెల్హిస్టరీ లేకుండానే పాజిటివ్ రావడంతో కలకలం మొదలైంది. గత నాలుగు రోజుల్లో హుజూరాబాద్, వీణవంక మండలాల్లో మూడు కేసులు నమోదు అవ్వగా.. ఇద్దరు బాధితులు మృతిచెందడం జిల్లాప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
అంతా ఓపెన్..
తాజాగా ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్మాల్స్ తెరుచుకున్నాయి. కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5గంటలకు కుదించారు. దీంతో కరోనా విజృంభణకు ఆస్కారం ఏర్పడింది. రాత్రి సమయంలో రాకపోకలు తక్కువగా ఉండగా, రోజంతా యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పట్టణాలతో పాటు పల్లెలకు కరోనా సోకుతుండడంతో, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారిలో ఆందోళన మొదలైంది. ఈ వైరస్ మహమ్మారితో మృత్యువాత పడుతున్న వారిలో శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణాలు మొదలవడంతోనూ ఇతరప్రాంతాల నుంచి అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా ప్రభావం తొలగిపోయిన తర్వాత శుభకార్యాలు చేద్దామని ఎదురుచూసిన వారికి ఇప్పట్లో ఆ పరిస్థితి కనబడడం లేదు. దీంతో వచ్చే వారంరోజుల్లో అనేక మంది వివాహాలు సైతం నిశ్చయించుకున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో
లాక్డౌన్ సడలింపుతో ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది మంది జిల్లాకు వస్తున్నారు. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ నిశితంగా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమానితులను క్వారంటైన్ చేస్తుండగా.. కొందరు హోం క్వారంటైన్ నిబంధనలు పాటించకపోవడం ముప్పు వాటిల్లుతోంది.
ఆదమరిస్తే అంతే...
కరోనా నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. కొత్తప్రదేశాలు, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు భౌతిక దూరం నియమాన్ని గుర్తుంచుకోవాలి. అత్యవసరమైతే తప్ప జనసంచారం ఉన్న చోటికి వెళ్లొద్దు. రాబోయే వర్షాకాలంలో వైరస్ తీవ్రత అధికమయ్యే ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
రాబోయే రెండు నెలలు కీలకం
గత రెండు నెలలకు పైగా లాక్డౌన్ నిబంధనలను పాటించి న ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కరోనాను లెక్కచేయకుండా తమ పనులన్ని చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉంది. దీనికి తోడు రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనాతో ప్రాణనష్టం మొదలవగా, సీజనల్ వ్యాధులు తోడైతే డేంజర్ బెల్ మోగుతాయనే భయం ప్రజలను వెంటాడుతోంది.
జాగ్రత్తగా ఉండాలి
కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు, అనుమానితులు ఉంటే అధికారులకు సమాచారం అందించాలి. ట్రావెల్హిస్టరీ ఉన్న వారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ పాటించాలి.
– డాక్టర్ సుజాత, డీఎంహెచ్వో