హైదరాబాద్‌లో కరోనా మృత్యు ఘంటికలు

27 Jun, 2020 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్‌ నర్సు కరోనాతో మృతి చెందారు. ఈనెల 30న పదవీ విమరణ చేయాల్సిన తరుణంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. తాను వయసురీత్యా పెద్ద కావడంతో కరోనా ఐసోలేషన్‌ వార్డులో పనిచేయలేనని, ఆ విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను అభ్యర్థించినా ఆయన అంగీకరించలేదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..)

కాగా, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 20 మంది వైద్యులు, పది మంది పారా మెడికల్‌ స్టాఫ్‌ కరోనా వైరస్‌ బారిన పడగా.. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సుమారు వంద మందికి వైరస్‌ సోకింది. ఇక నిమ్స్‌లో 67 మందికి కరోనా సోకగా, వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారు. మలక్‌పేట్, కొండాపూర్‌ ఆస్పత్రుల్లోనూ 30 మంది వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా.. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి చేరుకున్న సత్తెమ్మ అనే బాధితురాలు ఆస్పత్రి గేటు ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. (బ్యాంకులకుకరోనాస్ట్రెస్ టెస్టులు)

గాంధీ సూపరింటెండెంట్‌ పేషీలో... 
కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో కరో నా కలకలం సృష్టించింది. పేషీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌తోపాటు టైపిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఆస్పత్రి మినిస్టీరియల్‌ విభాగంలో విధులు నిర్వ హించే సీనియర్‌ అసిస్టెంట్‌తోపాటు ఓ నర్సుకు కూడా పాజిటివ్‌ రావడంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మరో ఉద్యోగికి.. 
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోరోజు మరో కరోనా పాజిటివ్‌ కేసు నమో దైంది. మూడో అంతస్తులోని పరిపాలనా విభాగం లో ఓ ఉద్యోగికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటు తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

కరోనాతో బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింహ్మారావు కన్నుమూత 
తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొనుగోటి నర్సింహారావు(70) కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చివ్వెంలకు చెందిన నర్సింహారావు పది రోజుల క్రితం బిల్డర్లకు రావాల్సిన బకాయిలు, వివిధ రకాల అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరినా ఫలితం లేకపోయింది.   

మరిన్ని వార్తలు