కిడ్నాపైన బాలుడికి కరోనా పాజిటివ్‌

17 May, 2020 08:15 IST|Sakshi

చాదర్‌ఘాట్‌ (హైదరాబాద్‌): తల్లి పొత్తిళ్ల నుంచి రెండు రోజుల కిందట కిడ్నాప్‌నకు గురైన చిన్నారికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. భర్త చనిపోవటంతో ఓ మహిళ ఏడాదిన్నర వయసున్న కుమారుడితో భిక్షాటన చేస్తూ చాదర్‌ఘాట్‌ సమీపంలో రోడ్డుపక్కన జీవిస్తోంది. దీంతో తలాబ్‌కట్టకు చెందిన ఆటో డ్రైవర్‌ ఇబ్రహీం ఆమె పొత్తిళ్ల నుంచి చాకచక్యంగా బాలున్ని కిడ్నాప్‌ చేశాడు. దీన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి ఇబ్రహీంను అరెస్ట్‌ చేశారు. తనకు సంతానం లేకపోవటం వల్లే రోడ్డుపక్కన ఉంటున్న బాలున్ని మూడు, నాలుగు రోజులుగా రెక్కీ చేసి కిడ్నాప్‌ చేశానని అతను అంగీరించాడు.

దీంతో ఇబ్రహీం ఇంటి నుంచి బాలున్ని తీసుకువచ్చి పోలీసులు తిరిగి తల్లికి అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఎలా సోకిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. తల్లితో పాటు కిడ్నాపర్, బాలున్ని రక్షించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు కూడా కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. బాలునికి కింగ్‌కోఠి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే బాలునికి వైరస్‌ అంటించిన వారి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.    

మరిన్ని వార్తలు