రోజూ 800 మందికి కరోనా స్క్రీనింగ్‌

4 Feb, 2020 01:11 IST|Sakshi

రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ ప్రక్రియపై వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష

వారంతా చైనా, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్, మలేసియా దేశస్తులే

ఆ దేశాలకు చెందిన మొత్తం 2,733 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌

జాగ్రత్తలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో రోజూ 800 మందికి కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వ హిస్తున్నారు. వైరస్‌ అధికంగా విస్తరించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలించాకే బయటకు పంపిస్తు న్నారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగ పూర్, మలేసియా దేశాల నుంచి హైదరా బాద్‌కు వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో స్క్రీనింగ్‌ చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆ దేశాలకు చెందిన 29 విమానాల నుంచి 2,733 మంది ప్రయాణికులను విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడిం చింది.

ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సోమవారం రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న స్క్రీనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం వారు అక్కడ సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల నుంచి రోజూ వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగుతుంటారు. వారిలో ఆ ఐదు దేశాలకు చెందిన ప్రయాణికులు రోజూ సరాసరి 800 మంది వస్తుంటారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మిగిలిన దేశాలకు చెందినవారికి జలుబు, దగ్గు, తలనొప్పి వంటి కరోనా వైరస్‌ లక్షణాలుంటే వెంటనే తమను సంప్రదించాలని కోరుతున్నారు. అటువంటి లక్షణాలతో ఇప్పటికే ఇళ్లకు చేరినవారుంటే తమను సంప్రదించాలని లేకుంటే ఎవరికివారు ఇళ్లల్లోనే ఒంటరిగా ఉండిపోవాలని కోరుతున్నారు.

ఇలా 27 మంది ప్రయాణికులు వస్తే వారు తమ తమ ఇళ్లల్లో 28 రోజుల పాటు ఇంటి నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేశారు. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రికి ఇప్పటివరకు వచ్చిన 19 ప్రయాణికులను పరీక్షించగా, వారికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. ఇదిలావుంటే రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్‌కు 125 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 4,275 వ్యక్తిగత రక్షణ పరికరాలు, 15 వేల ఎన్‌95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మరో ప్రకటనలో తెలిపారు.  

>
మరిన్ని వార్తలు