జర్నలిస్టుల కోసం గాంధీలో ప్రత్యేక వార్డు

11 Jun, 2020 09:56 IST|Sakshi

ఇప్పటి వరకు నగరంలో 16 మంది జర్నలిస్టులకు పాజిటివ్‌

గాంధీలో మనోజ్‌ పేరుతో ఆరో అంతస్తులో వార్డు..

సెక్రటేరియట్‌ జర్నలిస్టులకు కొనసాగుతున్న టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్‌ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్‌ మనోజ్‌ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించి, కరోనా వైరస్‌ వ్యాప్తి, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్‌ షాతో భేటీ)

ఈ క్రమంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం వైరస్‌ బారిన పడ్డారు. ఇలా ఇప్పటికే 16 మందికి వైరస్‌ సోకగా, వారిలో సకాలంలో వైద్యసేవలు అందక జర్నలిస్టు మనోజ్‌ మృతి చెందడం, జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. సచివాలయ బీట్‌ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరిన్ని వార్తలు