సాక్షి, హైదరాబాద్: హోం క్వారంటైన్లో ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్ను మరిం త మెరుగైన వైద్యసేవల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పద్మారావుతోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను శుక్రవారం అపోలో ఆస్పత్రికి తరలించి ప్రత్యేకగదిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావును సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్ ద్వారా పరామర్శించారు.
డిశ్చార్జయిన మహమూద్ అలీ
కరోనాతో ఆసుపత్రిలో చేరిన హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆయనతో పాటు కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. జూన్ 28న మహమూద్ అలీతోపాటు, ఆయన కుమారుడు, మనవడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన వారంతా ప్రస్తుతం డిశ్చార్జి అయ్యారు. ఇకపై హోంక్వారంటైన్లోనే ఉంటూ చికిత్స పొందనున్నారు.