ఒక్కరోజే 117 కేసులు 

29 May, 2020 02:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన 66 మందికి కరోనా సోకింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో మరో 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు తెలంగాణకు చెందిన వలస కార్మికులని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 2,256 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వారిలో తెలంగాణకు చెందిన కేసులు 1,908 ఉండగా, వలసదారులకు సంబం ధించినవి 175, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 143 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 67 మంది చనిపోయారు. మొత్తం 1,345 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 844 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 58, రంగారెడ్డి ఐదు, మేడ్చల్‌ రెండు, సిద్దిపేట జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.  

ట్రాఫిక్‌ ఏఎస్సైకి కరోనా
గౌలిపురా డివిజన్‌కు చెందిన ట్రాఫిక్‌ ఏఎస్సై (53) కరోనా సోకింది. ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు కరోనా సోకి మృతి చెందగా, ఆమె కుటుంబంలోనే మరో 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. నార్త్‌లాలాగూడ ఇందిరానగర్‌ ప్రాంతానికి చెందిన రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి బిజ్జిరామ్‌ (81)కు కరోనా సోకడంతో  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పహాడీషరీఫ్‌లో మరో 8 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇద్దరు విమాన ప్రయాణికులకు ‘కరోనా’
శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం యూకే– 877 విమానంలో ముంబై నుంచి వచ్చిన  వీరిద్దరు విదేశాల నుంచి వచ్చినట్లు సమాచారం.

గ్రేటర్‌లో రోజూ దుకాణాలు తెరచుకోవచ్చు
హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రకాల దుకాణాలను ఇక నుంచి ప్రతిరోజూ తెరిచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

>
మరిన్ని వార్తలు