సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణలో సానుకూల పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 120 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1284కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 650గా ఉంది. ఈరోజు కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది.
(చదవండి: ‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’)
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 38 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మంది, మేడ్చల్ జిల్లా నుంచి 6, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ్పేట నుంచి ఒక్కొక్కరు ఉండగా.. వలసదారులు 12 మంది, విదేశాల నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నేటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలు 3 ఉన్నాయని, 14 రోజులుగా పాజిటివ్ కేసులు లేని జిల్లాలు 21 ఉన్నాయని ఆయన వెల్లడించారు.
(చదవండి: గిటార్తో అదరగొట్టిన రాశీఖన్నా)