సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ఈ రోజు ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కలిపి మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలిపింది. వీరందరూ ప్రత్యేక ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వివరించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఇప్పటివరకు 13 మందిని డిశ్చార్జ్ చేశామని తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్లు ప్రకటించింది. మర్కజ్ నుంచి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవడానికి రావాల్సిందింగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా, కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఇంట్లోనే ఉండి సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ కోరింది.
చదవండి:
భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు..
ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!