ఒక్క రోజే 1,590 కేసులు

6 Jul, 2020 02:11 IST|Sakshi

ఏడుగురు మృతి.. 295కి పెరిగిన మరణాలు

రాష్ట్రంలో 23,902కి చేరిన కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,590 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 5,290 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 3,700 మందికి నెగటివ్‌ రాగా... 30 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23,902కు పెరిగింది. ఇందులో 10,904 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 12,703 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా మరో ఏడుగురు కరోనాతో మరణించడంతో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 295కి చేరింది. 

రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంది. తాజాగా ఆదివారం 1,277 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 125, రంగారెడ్డిలో 82,  సూర్యాపేట్‌లో 23, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో 14, కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో 4 చొప్పున, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో 3 చొప్పున, నిర్మల్, వికారాబాద్, కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో 2 చొప్పున, గద్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట్, వరంగల్‌ రూరల్, నారాయణపేట్, పెద్దపల్లి, యాదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. (ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000)

బాధితుల్లో పురుషులే అధికం!
కరోనా వైరస్‌ వ్యాప్తి పురుషుల్లోనే అధికంగా కనిపిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 23,898 పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే అందులో పురుషులు 15,559 మంది (65.1శాతం) ఉన్నారు. మహిళలు 8,339 మంది (34.90 శాతం) ఉన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అధికంగా 13 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపే ఎక్కువగా ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు కూడా వైరస్‌ బారిన పడుతున్నప్పటికీ, 12 ఏళ్లలోపు వారిలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. (చచ్చినా వదలట్లేదు)

మరిన్ని వార్తలు