సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓపై వేటు

22 Apr, 2020 11:56 IST|Sakshi
నూతన డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ నిరంజన్‌

సాక్షి, సూర్యాపేట: జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ బి.సాంబశివరావు నియమితులయ్యారు. కాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. (మార్కెట్ బజార్లో సీఎస్, డీజీపీ పర్యటన)

మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణమైన మార్కెట్‌ బజార్‌లో వీరు పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్‌ బజార్‌లోని వ్యాపారులు, వారి కాంటాక్టుల నుంచి నమోదైనవి 65 కేసులు ఉన్నాయి. (మార్కెట్ బజార్అంటే హడల్)

ప్రత్యేకాధికారిగా సర్పరాజ్‌అహ్మద్‌
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్‌ అధికారి సర్పరాజ్‌అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కరీంనగర్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎక్త్సెజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి కూడా ప్రత్యేక అధికారిని పెట్టారు. మున్సిపల్‌ పరిపాలనశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన గతంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేశారు. మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!)

‘పేట’ డీఎస్పీ బదిలీ, కొత్త డీఎస్పీగా మోహన్‌కుమార్‌
సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావును మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.మోహన్‌కుమార్‌ను నియమించారు. ఈయన బుధవారం విధుల్లో చేరనున్నారు. సూర్యాపేట డీఎస్పీగా నాగేశ్వర్‌రావు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశారు. కాగా ఈయన హైదరాబాద్‌ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.  (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! )

మరిన్ని వార్తలు