కరోనా మృతదేహం తారుమారు 

9 Jun, 2020 22:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మృతుని కుటుంబసభ్యులు, వైద్య సిబ్బంది మధ్య వాగ్వాదం

సనత్‌నగర్‌/గాంధీ ఆస్పత్రి: కరోనాతో మరణించిన బాధితుని మృతదేహం తారుమారు కావడంతో కలకలం చెలరేగింది. మృతదేహాన్ని తరలించిన వైద్యసిబ్బంది, మృతుని కుటుంబసభ్యుల మధ్య శ్మశానంలో వాగ్వాదం జరిగింది. బేగంపేట పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తి (45)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈనెల 7వ తేదీన కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని బావమరిది గాంధీ మార్చురీకి వచ్చి దూరం నుంచి చూసి తన బావ మృతదేహమేనని నిర్ధారించాడు. వైద్య సిబ్బంది మృతదేహాన్ని బేగంపేటలోని శ్మశానవాటికకు తరలించారు. కడసారి చూపు కోసం వచ్చిన మృతుని భార్య మృతదేహం తన భర్తది కాదని స్పష్టం చేసింది. దీంతో మృతుని కుటుంబసభ్యులు, వైద్యసిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. బేగంపేట పోలీసులు రంగంలోకిదిగి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మార్చురీలో ఉన్న గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని తిరిగి అప్పగించారు. 

మరిన్ని వార్తలు