కరోనా వైరస్‌: ప్లాస్టిక్‌, మొబైల్‌ ఫోన్లపై 72 గంటలు!

30 Mar, 2020 13:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 70 ఏళ్లు పైబడిన వారికి కరోనా వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఏషియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. అయితే, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి, నియంత్రణకు సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. కోవిడ్‌-19 ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా మంచిదని అభినందించారు. రాబోయే రెండు వారాల లాక్‌డౌన్ మరింత ముఖ్యమైనదని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే కరోనాను అధిగమించగలమని స్పష్టం చేశారు. 
(చదవండి: ఎర్రగడ్డ ఆసుపత్రికి పెరుగుతున్న కేసులు)

గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డా.నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలపై పరిశోధనలు జరుగుతున్నాయని... త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన పరిశోధనల్లో కొంత సత్ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. కరోనా భయంతో ప్రజలు అనవసర మందులు వాడొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్లాస్టిక్, మొబైల్‌ ఫోన్లపై 72 గంటలు వైరస్ ఉంటుందని చెప్పారు. 20 సెకన్ల పాటు ఏ సబ్బుతోనైనా చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అన్నారు. మాల్స్‌కు వెళ్లి వచ్చినప్పుడు బ్యాగులను శానిటైజ్ చేయాలని తెలిపారు.
(చదవండి: ఛండీఘర్‌లో అడవి జంతువు కలకలం!)

మరిన్ని వార్తలు