జీహెచ్ఎంసీ మేయర్‌ డ్రైవర్‌కు కరోనా

11 Jun, 2020 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. విధుల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మేయర్‌తో పాటే ఆ వ్యక్తి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అతడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌కు కరోనా అని తేలడంతో మేయర్‌‌ కుంటుంబం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. రేపు మేయర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.  (వధువు తండ్రి, చెల్లికి వైరస్‌.. పెళ్లికి బ్రేక్‌)

కాగా, నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మేయర్‌ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్ట​ర్‌కు కరోనా సోకినట్లు తేలింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు