తెలంగాణ: కరోనాతో పోలీసు అధికారి మృతి

22 Jun, 2020 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా‌తో తెలంగాణలో మరో పోలీసు అధికారి మృతి చెందారు. కాలాపత్తర్‌ పోలీస్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్‌(47) కోవిడ్‌ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 20 రోజుల క్రితమే యూసుప్‌ కాలాపత్తర్‌ పీఎస్‌లో ఏఎస్‌ఐగా చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
(చదవండి : మూడు వారాలు.. 128 మరణాలు!)

ఈ మహమ్మారి బారిన ఓ వైద్యుడు కూడా మృతి చెందారు. కోవిడ్‌ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఓ వైద్యుడు (70) మృతి చెందారు. వారం క్రితం జ్వరంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆ వైద్యుడు.. అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. 

కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే గరిష్టంగా 730 మంది కరోనా బారిన పడ్డారు.రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కోవిడ్‌–19 వచ్చిన వారి సంఖ్య 7,802కు పెరిగింది. ఇందులో 3,861 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,731 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరిన్ని వార్తలు