సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 229కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నేడు ఇద్దరు మృతి చెందినట్టు తెలిపింది. మృతుల్లో ఒకరు షాద్నగర్, మరోకరు సికింద్రాబాద్కు చెందినవారని పేర్కొంది. వీరిని కలిసిన వారందరినీ గుర్తిస్తున్నామని వెల్లడించింది. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ రోజు కరోనా నుంచి కోలుకున్న 15 మంది డిశ్చార్జ్ కావడంతో.. మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో 32 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, మర్కజ్ నుంచి వచ్చినవారందరినీ గుర్తించినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి వచ్చినవారిని, కరోనా లక్షణాలు ఉన్న వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ సెంటర్లకు తరలించి యుద్ధప్రతిపాదికన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ఆరు ల్యాబ్ల్లో 24 గంటల పాటు మూడు షిప్టుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది.