హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బృందం

28 Jun, 2020 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణలో భాగంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పర్యటిస్తారు. అక్కడినుంచి నేరుగా బీఆర్కే భవన్‌లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటునుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు.
(చదవండి: అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ : కేసీఆర్‌)

కాగా, ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.
(టిమ్స్‌ రెడీ..!)

మరిన్ని వార్తలు