అనుమానంతో గ్రామస్తుల అమానుషం!

4 Jul, 2020 14:49 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: బిక్కనూరు మండలం జంగంపల్లిలో దారుణం వెలుగుచూసింది. కరోనా అనుమానంతో తల్లీకొడుకును ఆ గ్రామస్తులు ఊళ్లోకి రానివ్వలేదు. గ్రామశివారు స్కూల్‌లోని ఓ గదిలో ఉండాలని బాధితులకు వారు హుకుం జారీ చేశారు. వారికి కరోనా లక్షణాలు లేకున్నా వెలివేసి శిక్ష విధించారు. వివరాలు.. ఇటీవలే సుధారాణి కూతురు డెలివరీ అయింది. కూతురును చూసేందుకు సుధారాణి తన కొడుకు రాకేష్‌తోపాటు ఆస్పత్రికి వెళ్లి వచ్చింది. అయితే, సుధారాణి కూతురు, నవజాత శిశువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సుధారాణి ఆమె కొడుకును గ్రామంలోకి రానీయలేదు. వారికి కూడా కరోనా సోకిందనే అనుమానంతో అమానుషంగా ప్రవర్తించారు. తమకెలాంటి లక్షణాలు లేవని, ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటామని బతిమాలినా గ్రామస్తులు వారి మాట వినిపించుకోలేదు. దాంతో గ్రామ శివారులోని పాఠశాలలో మూడు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు పడిన సుధారాణి, రాకేష్‌ తీవ్ర మనోవేదనతో సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గ్రామస్తుల మానసిక వేధింపులతో చనిపోయేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలుతీసుకోవాలని కోరారు. (చదవండి: గాంధీలో పేషెంట్ల పరిస్థితి దయనీయం)

మరిన్ని వార్తలు