ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట

20 Sep, 2019 02:31 IST|Sakshi

ఇంజనీరింగ్‌ను మించి స్కూల్‌ ఫీజులు!

శాస్త్రీయత లేని పాఠశాలల ఫీజుల భారం తగ్గేదెప్పుడు?

ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోని ఫీజుల నియంత్రణ

ప్రభుత్వ పరిశీలనలోనే తిరుపతిరావు కమిటీ నివేదిక

నివేదికపై నిర్ణయం తీసుకునే వరకు పెంచొద్దన్న ప్రభుత్వం

ఫలితంగా పదేళ్లుగా అమలుకు నోచుకోని ఫీజుల నియంత్రణ

ఏటా తల్లిదండ్రులకు తప్పని భారం  

  • హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మంచి పేరున్న ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో వార్షిక ఫీజు రూ.78 వేలు మాత్రమే. ఇక సాధారణ ఇంజనీరింగ్‌ కాలేజీలో అయితే కనీస వార్షిక ఫీజు రూ.35 వేలే.
  • అదే నగరంలోని ఆ కాలేజీకి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదివే విద్యార్థి వార్షిక ఫీజు రూ.85 వేలు. అంటే ఇంజనీరింగ్‌ కంటే పదో తరగతి చదివే విద్యార్థి ఫీజే ఎక్కువ.
  • పోనీ విద్యార్థులకు సదుపాయాలు, టీచర్ల వేతనాల విషయంలో ఇంజనీరింగ్‌ కాలేజీకంటే ఎక్కువగానే కల్పిస్తున్నారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితే.
  • కనీసం స్కూల్లోని విద్యా ర్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందా? అంటే అదీ లేదు. మొన్నటి పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూల్‌కు చెందిన చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు.
  • అందులో శ్రీవర్ధన్‌ అనే విద్యార్థి ఉన్నాడు. అతని తండ్రి రాజేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి. వరంగల్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన తన కొడుకును  కార్పొరేట్‌ స్కూల్‌లో చేర్చాడు. అప్పులు చేసి మరీ చదివించినా ఫలితం లేకుండా పోయింది.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇలా అనేకమంది తండ్రులు తమ పిల్లలను బాగా చది వించాలన్న తపనతో కార్పొరేట్, పేరున్న ప్రైవేటు స్కూళ్లలో చేర్చి ఆర్థికంగా అప్పులపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 30,77,884 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3,487 కార్పొరేట్, టాప్‌ పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌ స్కూల్‌ వంటి 62 రకరకాల పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్‌ ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్‌ పాఠాలు? అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగింది.. కొనసాగు తూనే ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే ఫీజులు వసూలు చేస్తున్నా స్కూల్‌ ఫీజుల నియంత్రణ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 

25 శాతం ఫీజుల పెంపు..
ప్రభుత్వం వద్దన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్‌ స్కూళ్లు ఈసారి 25% వరకు ఫీజులను పెంచే శాయి. అయినా ఫీజుల నియంత్రణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కోర్టు కేసులు.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా పెంపు ఏటా ఇదే తంతు. పోనీ ఆ ఫీజుల వసూలు, పెంపులో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా అడ్డుకట్ట పడక తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆశలతో అప్పులు చేసి మరీ ఫీజులను చెల్లించక తప్పడం లేదు.

శాస్త్రీయత ఎక్కడ..?
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ విధానం లేదు. ప్రభుత్వాలు గత పదేళ్లుగా అనేక చర్యలు చేపట్టినా న్యాయ వివాదాల్లోనే అవన్నీ చిక్కుకున్నాయి. ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి విద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో విఫలం కావడంతో ఆ ఉత్తర్వులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి.

ప్రతిసారీ ఏదో ఒక కారణంతో..
రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్‌ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగిపోతోంది. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91, 92లను జారీ చేసింది. దాని ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్‌ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని, జిల్లా స్థాయిలో ఫీజుల ఖరారు కుదరదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 41, 42లను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా 2016లో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు ఆగిపోయింది. 

హైకోర్టులో పిల్‌.. ఆపై కమిటీ..
2016లో ఫీజుల నియంత్రణపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 మార్చిలో నియమించింది. ఆ కమిటీ కూడా పలు సిఫారసులు చేసింది. ప్రైవేటు స్కూళ్లు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ నివేదించడంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఫీజులను పెంచవద్దని 2018 ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల నియంత్రణ ఆగిపోయింది.

ఆదాయ వ్యయాలను బట్టి నిర్ణయించేలా?
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా కాకుండా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఫీజుల నిర్ణయం, వసూళ్లలో శాస్త్రీయత ఉంటుందని, ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు నిర్ణయిస్తే భారం కూడా తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు