ధర కోసం పత్తి రైతుల ఆందోళన 

14 Dec, 2017 03:56 IST|Sakshi
ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌లో నిలిచిన పత్తి కొనుగోళ్లు

ఆదిలాబాద్‌: పత్తికి ఓ వ్యాపారి పెట్టిన ధరను మిగిలినవారు సైతం పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర పెరుగడంతో ఆది లాబాద్‌ మార్కెట్‌యార్డ్‌కు పెద్దఎత్తున రైతులు పత్తి తీసుకొచ్చారు. ఉదయం నిర్వహించిన వేలంపాటల్లో ఓ వ్యాపారి క్వింటా పత్తికి రూ. 4,800 ధర పెట్టేందుకు ముందుకు వచ్చాడు.

ఈ క్రమంలో రైతులు తమ పత్తికి అంతే ధర పెట్టాలని కోరగా మిగిలిన వ్యాపారులు అంగీకరించలేదు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తి కొనుగోళ్లు జరగలేదు. నాయకులు, మార్కెట్‌ కమిటీ అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులకు నచ్చజెప్పడంతో చివరకు రూ.4,800కు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుకు బుధవారం 10 వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి అన్నెల అడెల్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు