నేటి నుంచి పత్తి కొనుగోళ్లు

10 Oct, 2018 02:59 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 267 జిన్నింగ్‌ మిల్స్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, తేమ 12% ఉంటే ఎక్కువ ధర అందుతుందని తెలిపారు.

పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. నిజామాబాద్‌లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్‌ జిల్లాలో 21 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటాలు రూ. 1,700 మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసల కొనుగోలుకు 6 కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.6,975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు