డిగ్రీ తుది దశ కౌన్సెలింగ్‌ షెడ్యూలు జారీ

20 Jul, 2017 02:32 IST|Sakshi

ఈనెల 22 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లు
ఆగస్టు 4న సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌:
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్‌ నిర్వహణకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కమిటీ చర్యలు చేపట్టింది. ఈనెల 20వ తేదీ నుంచే తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావించినా, ఏర్పాట్లకు సమయం సరిపోదన్న ఆలోచనతో ఈనెల 22కు వాయిదా వేసింది. ఆ మేరకు ఈనెల 22 నుంచి 31 వరకు తుది దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని కమిటీ బుధవారం నిర్ణయించింది. దీని కోసం మీసేవా కేంద్రాల్లో అథెంటికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది.

ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీన సీట్లను కేటాయించనుంది. సీట్లు పొందిన విద్యార్థులంతా ఆగస్టు 4వ తేదీ నుంచి 11లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కమిటీ పేర్కొంది. మొదటి, రెండు దశల్లో సీట్లు పొందిన వారిలో 1,51,588 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, తుది దశ కౌన్సెలింగ్‌లో 2,57,479 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు