ఎండలతో కరోనా తగ్గుముఖం!

15 Mar, 2020 01:58 IST|Sakshi

నియంత్రణ చర్యలు ఉపయోగపడతాయి  

ఏప్రిల్‌ చివరి వారానికి కేసులు తగ్గే అవకాశం

సీనియర్‌ శాస్త్రవేత్తల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై భారతీయులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్తలు. ఇటలీ, ఇరాన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో కొత్త కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. మరో రెండు మూడు వారాల్లో కేసుల సంఖ్య ఎక్కువైనా.. ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా. అమెరికా, బ్రిటన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఆస్పత్రిలో చేరేవారు.. మరణాల గురించి ఇప్పటికే కొన్ని కంప్యూటర్‌ ఆధారిత మోడల్స్‌ వచ్చాయని, వాటి ప్రకారం ఆయా దేశాల్లో కొన్ని లక్షల మంది మరణిస్తారన్న అంచనాలు ఉన్నా.. అవేవీ భారత్‌కు వర్తించవని వీరు ‘సాక్షి’తో స్పష్టం చేశారు. 

ఆందోళన వద్దు..
అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ఇటీవల చేసిన ఓ కంప్యూటర్‌ మోడలింగ్‌ ప్రకారం.. ఆ దేశంలో రానున్న ఏడాది కాలంలో మొత్తం 16 కోట్ల మంది కరోనా వైరస్‌ బారిన పడతారు. 2 లక్షల నుంచి 17 లక్షల వరకు మరణాలు ఉండొచ్చని సీడీసీ మోడల్‌ హెచ్చరిస్తోంది. సీడీసీ ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సదస్సులో ఈ మోడల్‌పై చర్చ జరిగినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ అంశాలను డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా దృష్టికి తీసుకురాగా.. భారత్‌లో ఇలా మోడలింగ్‌ చేసే సంస్థలు లేవని పేర్కొన్నారు. అయితే మన వాతావరణ పరిస్థితులు, ప్రజల సాధారణ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్‌ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ మొదటి వారానికల్లా కొత్త కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుని.. రెండు, మూడు వారాల తర్వాత తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌ ప్రభావం వృద్ధుల్లోనే ఎక్కువని పేర్కొన్నారు. 

కొత్త కేసుల రేటు తక్కువ.. 
గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించగా జనవరి నెలాఖరుకు అక్కడి ప్రభుత్వం.. రవాణాపై ఆంక్షలు విధించిందని శ్రీవారి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత కేసు లు తగ్గుముఖం పట్టాయని, భారత్‌తో పా టు ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొ చ్చని అంచనావేశారు. దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో వైరస్‌ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టారని, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసేశారని ఈ చర్యల ఫలితం త్వరలోనే కనిపిస్తుందని చెప్పారు. ఐఐసీటీలోనూ తాము వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో రోజుకు నమో దవుతున్న కొత్త కరోనా వైరస్‌ కేసులు 10 కంటే తక్కువ ఉన్నాయని, దీన్నిబట్టి చూసి నా ఆందోళన అవసరం లేదన్నది స్పష్టమవుతోందని చెప్పారు. ఉష్ణోగ్రతల పెరుగుద లతో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట పడుతుం దని కొందరు చెబుతున్నారని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పిస్తే ప్రజలు ఇతరులతో కలవడాన్ని తగ్గించాలని, వైద్యులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

చదవండి:
భయం లేదు.. జాగ్రత్తలే
కరోనా ఎఫెక్ట్‌ ఎలా ఉందంటే..

మరిన్ని వార్తలు