కడచూపునకు ‘కరోనా’ దెబ్బ 

19 Mar, 2020 03:32 IST|Sakshi

సాయంత్రం 4లోపు అంత్యక్రియలు పూర్తి చేయాలి..

కేవలం 50 మందికి మాత్రమే అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ భూతం శ్మశానవాటికలనూ తాకింది. దగ్గరి బంధువులను సైతం చివరి చూపు చూడకుండా కట్టడి చేస్తుంది. వివిధ కారణాలతో ఎవరైనా చనిపోతే వారి బంధువులు, స్నేహితులు శ్మశానవాటిక వరకు వస్తారు. అంతిమయాత్రకు కూడా పరిమితమైన సంఖ్యలోనే సందర్శకులు రావాలని, దీనికి కూడా నిబంధనలు వర్తిస్తాయంటూ శ్మశానవాటిక నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 50 మందితో మాత్రమే అంతిమయాత్రకు అనుమతి ఉంటుందని, అది కూడా సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ తంతు పూర్తి చేయాలని శ్మశానవాటిక నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.  

చివరిచూపు లేకుండా... 
బంధువుల్లో ఎవరైనా చనిపోతే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వచ్చి చివరిచూపు చూసి ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో అంతిమయాత్రలో 50 మందికి మించొద్దని ఆదేశించింది. పరిమిత సంఖ్యలో హాజరు కావాలని ప్రభుత్వం సూచించడంతో ఎవరెవరిని అంతిమ యాత్రకు అనుమతించాలి అనేది ఆయా కుటుంబాల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఎవర్నీ కాదనే పరిస్థితి లేకపోవడం సమస్యగా మారి, కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు కూడా దారితీస్తోంది.

మరిన్ని వార్తలు