మార్చి31 వరకు బంద్‌: స్టోర్లలో ఎగబడిన జనం

15 Mar, 2020 00:25 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రత్తమయ్యాయి. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్తలు చేపట్టింది. మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లతో పాటు జనసామర్థ్యం ఎక్కువగా ఉండే రధ్దీ ప్రాంతాలపై నిషేదాజ్ఞలు విధించింది. అయితే సరుకుల కొరతతో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సూపర్‌ మార్కెట్లు, దుకాణాలు యథావిథిగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

అయితే మార్చి 31 వరకు తెలంగాణలో అన్ని సూపర్‌ మార్కెట్లు, దుకాణాలు మూసివేస్తున్నారని పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అందోళనకు గురైన ప్రజలు సరుకుల కోసం సూపర్‌మార్కెట్లు, దుకాణాల్లో లైన్లు కట్టారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న అన్ని షాపింగ్‌​ మాల్స్‌, సూపర్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి. అయితే నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి ఢోకా లేదని, ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పేర్కొంది. 

అదేవిధంగా కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. దగ్గు, జలుబు, తుమ్ములు, జర్వం, శ్వాస తీసుకోవడలో ఇబ్బందులు పడుతున్నా వారితో పాటు ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ రుగ్మతలున్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరూములును, మాస్కులు ధరించాలన్నారు. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇతరులకు మీటరు దూరంలో ఉండాలన్నారు. ప్రతి అరగంటకు ఒకసారి చేతులను సబ్బు లేదా సానిటైజర్‌తో  శుభ్రపర్చుకోవాలని సూచించారు.

వివాహ వేడుకలను రద్దు చేసుకుంటున్నారు..
దేశంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు గుమిగూడి ఉండకూడదని వైద్య ఆరోగ్య అధికారులు సూచిస్తుండటంతో పలువురు వివాహ వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే వివాహ తేదీ ఖరారైన వారు మాత్రం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహాలు జరిపిస్తున్నారు. అయితే చాలావరకు బర్త్‌డే పార్టీలు, వివాహ రిసెప్షన్‌లను రద్దు చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు