బంధువుల ఆరోపణ
ఆక్సిజన్ కొరత లేదని సూపరింటెండెంట్ వివరణ
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసింది. నేరేడ్మెట్ సాయినగర్కు చెందిన గొల్ల శ్రీధర్ శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీధర్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స సమయంలో తనకు శ్వాస ఆడటం లేదని, ఆక్సిజన్ పెట్టమని చెప్పినప్పటికీ ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబ సభ్యులకు వివరించినట్లు ఒక ఆడియో బయటికి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ పెట్టకపోవడం వల్లే శ్రీధర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేద ని, ఆ పేరుతో ఉన్న యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి మృతుల జాబితాలో కూడా లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.