సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని సీపీ అంజనీకుమార్ కోరారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి సూచించారు. ప్రజల సౌకర్యార్థం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చినవారిని హోం క్వారంటైన్లో ఉంచుతామని వారందరూ 14 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలి అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు.
సొంతవూర్లకు వెళ్లడానికి ఇచ్చిన పాస్లను దుర్వినియోగం చెయ్యొద్దని కోరారు. లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా నిత్యవసరాల కోసం బోయిన్పల్లి, మీరాలమండి మార్కెట్లకు వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించి రోడ్లపై తిరగకుండా ఉండాలని, అవసరం లేకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
‘‘ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందరం క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగాలి. లాక్డౌన్ సమయంలో సౌకర్యమంతమైన వాతావరణం ఉండదు. 10వేల మంది నగర పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. ఈ రోజు నాలుగు గంటల పాటు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించాం. సమీక్ష తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అత్యవసర విభాగాల్లో పనిచేసిన వారికి పాస్లు ఇస్తాం. హైదరాబాద్కు సంబంధించి 900 పాస్లు ఇచ్చాం. పాస్ల కోసం ఆన్లైన్లో ఈ-మెయిల్ చేయండి. covid19.hyd@gmail.com ద్వారా పాస్ల కోసం వినతులు పంపాలి. అలాగే, 9490616780 నంబర్కు వాట్సప్ సందేశాలు పంపొచ్చు’’ అని వివరించారు.