సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. లోపభూయిష్టంగా మారిన సీఎం విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు క్షేత్రస్థాయిలో పోరాటా లకు రూపకల్పన చేస్తామని ప్రకటించారు. ఆది వారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ ఒంటెత్తు పోకడలు ఏమాత్రం మార్చుకోలేదని విమర్శించారు. భూ ప్రక్షాళనలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులతో ముఖాముఖి నిర్వహణ, పోడు, సాగుభూముల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామని తెలిపారు. జూలై 19, 20 తేదీల్లో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన చేపడతామని చెప్పారు.
ప్రజా సమస్యలపై పోరాటం..
పేద ప్రజల ఇళ్ల కోసం, విద్యార్థి, యువజన, ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై సీపీఐ నిరంతరం ఉద్యమిస్తుందని చాడ అన్నారు. హిమాయత్నగర్లోని మఖ్దూంభవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో నగరంలోని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు చాడ సమక్షంలో సీపీఐలో చేరారు.