‘క్లోన్‌’ చేసి రూ.కోటి కొట్టేశారు!

8 Jul, 2017 02:04 IST|Sakshi
‘క్లోన్‌’ చేసి రూ.కోటి కొట్టేశారు!

► క్రెడిట్, డెబిట్‌ కార్డుల్నిక్లోనింగ్‌ చేసిన ముఠా
► స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా
► నలుగురి అరెస్టు


సాక్షి, హైదరాబాద్‌: కరెంట్‌ ఖాతాల ఆధారంగా బ్యాంక్‌ నుంచి క్రెడిట్, డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్‌ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.

కరెంట్‌ ఖాతాల ద్వారా..
నగరానికి చెందిన మామిడి మహేశ్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లో 4 కరెంట్‌ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్‌ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్‌కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్‌ మెషీన్లను స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్‌కు కొన్నాళ్ల క్రితం చాంద్‌పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్‌ చేసిన క్రెడిట్, డెబిడ్‌ కార్డులతో పాటు పిన్‌ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్‌ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్‌ ఇస్తానంటూ ఎర వేశాడు.

కమీషన్‌ కోసం పక్కదారి..
కమీషన్‌ కోసం కిరణ్‌ స్వైపింగ్‌ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. కేరళలోని యూసుఫ్‌ నుంచి క్లోన్డ్‌ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్‌ మెషీన్లలో స్వైప్‌ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్‌ కరెంట్‌ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్‌ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలినది అబుబాకర్‌ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాడు. అబుబాకర్‌ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలింది యూసుఫ్‌ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్‌కు రామ్‌ప్రసాద్‌.. అబుబాకర్‌కు కేరళకే చెందిన హనీఫ్‌ హంజా సహకరించారు.

రెండు నెలల్లో రూ.కోటి స్వైప్‌
ఈ గ్యాంగ్‌ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్‌ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్‌కే బ్యాంక్‌ జారీ చేసిన స్వైపింగ్‌ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్‌ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్‌కే బ్యాంక్‌ అధికారి మహ్మద్‌ అల్తాఫ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్‌తో పాటు చాంద్‌పాషా కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు