ఆధునిక టెక్నాలజీతో నేరాల నియంత్రణ

26 Jun, 2018 14:49 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు 

ఆన్‌లైన్‌ విధానంపై  పోలీసులు అవగాహన పెంచుకోవాలి

కేసులపై క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ చేపట్టాలి

స్పెషల్‌ డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాలు నివారించాలి

ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు

మామునూరు వరంగల్‌ : నూతన టెక్నాలజీని వినియోగించుకుని నేరాలను నియంత్రించాలని వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీసు సిబ్బందికి సూచించారు. నిరంతర ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా తయారు చేయాలని ఆదేశించారు. కేసులపై నాణ్యమైన ఇన్వెస్టిగేషన్‌ చేపట్టి నేరస్తులకు జైలు శిక్ష పడేలా చేసి వారికి పోలీసులంటే భయం ఏర్పడాలని పేర్కొన్నారు.

సోమవారం  మామునూరు ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శోభన్‌కుమార్‌ నేతృత్వంలో సబ్‌ డివిజన్‌ స్థాయి సీఐ, ఎస్సైలతో నిర్వహించిన సమావేశంలో డీసీపీ మాట్లాడారు.  ప్రభుత్వం పోలీసు శాఖను సాంకేతిక దిశలో తీర్చిదిద్దుతున్న తరుణంలో ప్రతి కేసును ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలన్నారు. ప్రతి పోలీసు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మెరుగైన పని తీరుతో స్టేషన్‌ సిబ్బంది పెండింగ్‌  కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

సబ్‌ డివిజన్‌ పరిధిలో నేరాలతో పాటు చోరీలు జరుగకుండా పగలు, రాత్రి గస్తీనీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుక వచ్చేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల రక్షణే  ధ్యేయంగా ఎస్సైలు తమ స్టేషన్‌ పరిధిలోని  ప్రజలతో ఫ్రెండ్లీగా మెలగాలన్నారు. దీంతో నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్‌ రోడ్డు నుంచి ఆర్టీఏ జంక్షన్‌ వరకు ప్రత్యేక జోన్‌గా గుర్తించి  ప్రమాదాలను నివారించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక స్పెషల్‌ డ్రైవ్‌లో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు.సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేసి సంబంధిత ఆర్టీఏకు ఆప్పగించాలన్నారు. ఇప్పటి నుంచి కోర్టు కానిస్టేబుల్‌ను కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా ,గ్రామ బీట్‌ కానిస్టేబుల్‌ను విలేజీ డ్యూటీ ఆఫీసర్‌గా పిలవనున్నట్లు వెల్లడించారు.

అనంతరం ఏసీపీ శోభన్‌కుమార్, సీఐ శ్రీనివాస్‌తో కలసి డీసీపీ జాతీయ రహదారిపై  ఎక్కువగా ప్రమాదం జరిగే స్థలాలను పరిశీలించారు. ప్రమాద స్థలంలో సాంకేతిక బోర్డు  ఏర్పాటుతోపాటు నిఘాను పెంచాలని సూచించారు.  కార్యక్రమంలో మామునూరు సీఐ  శ్రీనివాస్, పర్వతగిరి సీఐ శ్రీధర్‌రావు,  సబ్‌డివిజన్‌ ఎస్సైలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు