సిటీ యువకుడి వైద్యానికి అంతర్జాతీయ సాయం

26 Jan, 2019 10:51 IST|Sakshi

నగర యువకుడి చికిత్సకు

సాయపడిన క్రౌడ్‌ఫండింగ్‌...

సాక్షి, సిటీబ్యూరో: తీవ్ర అనారోగ్యానికి గురైన నగర యువకుడి చికిత్సకు అంతర్జాతీయ సాయం అందింది.  ఈ వివరాలను ప్రముఖ క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థ ఇంపాక్ట్‌ గురు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి అయిన భానుప్రకాష్‌ (22) అనారోగ్య సమస్యలతో గత డిసెంబరులో అపోలో ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం అతనికి సోకింది తీవ్రమైన మైలాయిడ్‌ లుకేమియా వ్యాధిగా నిర్ధారించి, 4వారాల పాటు కీమో థెరపీ, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరమని  ఆసుపత్రి వైద్యులు సూచించారు.

చికిత్సకు  రూ.15లక్షలు ఖర్చవగా మరో రూ.25లక్షలు వరకూ అవసరమైంది. అంత మొత్తాన్ని భరించలేని మధ్యతరగతికి చెందిన భాను ప్రకాష్‌ కుటుంబం క్రౌడ్‌ ఫండింగ్‌ సంస్థ ఇంపాక్ట్‌ గురును ఆశ్రయించింది. ఈ రోగి గురించిన సమాచారం ఇంపాక్ట్‌ ద్వారా తెలుసుకున్న 1234 మంది దాతలు కేవలం 2 వారాల్లోనే రూ.25.40లక్షలను విరాళంగా అందించారు. అయితే.. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన బోన్‌మ్యారో దాత దే«శీయంగా అందుబాటులోకి లేకపోవడం, యూరప్‌ దేశాలకు నుంచి తీసుకోవాల్సిరావడంతో అదనంగా రూ.10లక్షలు వ్యయం చేయాల్సి వస్తోందని, మరో 2వారాల సమయం ఉన్న పరిస్థితుల్లో మరింత మంది దాతలు స్పందిస్తారని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు