బిర బిర పెరిగే బీర..

20 Mar, 2018 09:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాగులో సమయం తక్కువ.. దిగుబడి ఎక్కువ

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

మూడు వారాల్లో కాతకు బీర

నిజామాబాద్‌: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్‌ కల్గి ఉండి తొందరగా చేతికందే పంట బీర. అతి తక్కువ వ్యయంతో తక్కువ వ్యవధిలో బీర సాగు ఎలా చేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యాజమాన్య పద్ధతులు మేలు..
బీర తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో యాజమన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే ముగ్గురు, నలుగురు కూలీలు అవసరమవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు.

వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్‌ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న హైబ్రిడ్‌ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులంతా ఒకేసారి ఈ పంట వేయకుండా అంచెలంచెలుగా వేస్తే ధర స్ధిరంగా ఉండే ఆవకాశాలున్నాయి. కానీ ఒక్కోసారి ఉత్పత్తి పెరిగి ధర తగ్గిపోవడం వల్ల నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయల పంటలకు ఎక్కువగా తెగుళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తెగుళ్లుపై ముందే జాగ్రత్తపడి తగిన మందులు పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. డ్రిప్‌ పద్ధతిలో సాగు చేస్తే మరిన్ని దిగుబడులు వచ్చే అవకాశముంది.

విత్తన శుద్ధి..

కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొ ప్పున ఇమిడా క్లొప్రిడ్, ఒక దాంతో మరోటి కలిపి విత్తనశుద్ధి చేసుకో వాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల సహజ ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్‌ను పంట చేనులోని గుంతల్లో వేయాలి. 40 కిలోల నత్రజని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 రోజులకు పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేస్తే నీటి తడిని అందించాలి. 

విత్తే పద్ధతి..
నీటి కాలువలకు తోడుగా మురు గు నీరు పోవడానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు ఏర్పాటు చే యాలి. అన్నిరకాల పాదులకు మూడు విత్తనాలను 1.2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి.

ఎరువులు..
విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 32–40 కిలోలను రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25–30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి.

నీటి యాజమాన్యం..
పాదు చుట్టూ 3–5 సెంటీ మీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరివ్వాలి. వారానికోసారి నీటి తడులు ఇస్తే బాగుంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి.

తెగుళ్లు..
తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. అందులో బూజు తెగులు, బుడిద తెగులు, వేరుకుళ్లు తెగులు, పక్షి కన్ను తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు వెంటనే ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి మందులు పిచికారీచేయాలి.

సస్యరక్షణ చర్యలు
- ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి
- పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి.
- కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- వంద గ్రాముల విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి రెండు గ్రాముల చొప్పున వాడి విత్తనశుద్ధిచేయాలి. 

మరిన్ని వార్తలు