రోడ్లన్నీ బిజీ.. కాస్త ఆలస్యంగా వెళ్లండి! 

25 Sep, 2019 02:34 IST|Sakshi

గూగుల్‌ మ్యాప్స్, ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి నిమిషం రిపోర్ట్‌

వాహనదారులకు చేరేలా సోషల్‌ మీడియాలో ప్రచారం 

సాక్షి, హైదరాబాద్‌ :  మంగళ వారం.. సాయంత్రం 4.45 గంటలవుతోంది.. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఎడతెగని వర్షం పడుతోంది.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకునే ఉద్యోగులు కాస్త ఆలస్యంగా బయటకు వస్తే మంచిది... గచ్చిబౌలిలోని విప్రో కంపెనీలో పనిచేసే అరుణ్‌ సెల్‌ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారం అది. ఇది ఎవరు పంపించారా.. అని చూస్తే సైబరాబాద్‌ కాప్‌ పేరుతో వచ్చింది.  థ్యాంక్స్‌  విలువైన సమయాన్ని ఆదా చేయడంతోపాటు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోకుండా సహాయపడ్డారు. థ్యాంక్స్‌ టు సైబరాబాద్‌ కాప్స్‌ అనుకున్నాడు... ఇది ఒక్క అరుణ్‌కే కాదు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సెల్‌కు వెళ్లిన సారాంశమదీ.

ఐటీ ఉద్యోగులతోపాటు ఈ ఐటీ కారిడార్‌లో జర్నీ చేసే ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరవేయడంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సఫలీకృతులయ్యారు. ఇలా గతేడాది మొదలైన ఈ అలర్ట్స్‌ ఇటీవల   పుంజుకున్నాయి. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మార్గదర్శనంలో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీసు బృందాలు సోషల్‌ మీడియా వేదికగా సిటీవాసులను అప్రమత్తం చేస్తున్నాయి.  ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ తీవ్రతను పసిగట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీళ్లు గూగుల్‌ మ్యాప్స్‌లోని కలర్‌ కోడింగ్స్‌ ద్వారా ట్రాఫిక్‌ రద్దీని గుర్తించి సంబంధిత ట్రాఫిక్‌ పోలీసు సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు ఎస్‌ఎంఎస్‌లతోపాటు వాట్సాప్‌ మెసేజ్, సోషల్‌ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. 
 

(వర్ష బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్ దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు