దివ్యదృష్టి

9 Mar, 2019 11:01 IST|Sakshi
దివ్యారెడ్డి

స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తున్న నగరవాసి

ఆరోగ్యం కోసం దేశీయ ఆవుపాల సరఫరా

అనేక అవార్డులు, ప్రశంసలు   

చిన్నారుల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు పాలు చాలా దోహదం చేస్తాయి. మరి రోజూ మనం తాగే పాలు మంచివేనా అంటే.. సమాధానం లేదు. ప్యాకెట్‌పాలలో రసాయనాలు కలిపి కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు స్వార్థపరులు. దీంతో ఆలోచించిన దివ్యారెడ్డి స్వచ్ఛమైన పాలనే (దేశీయ ఆవులు, గేదెలు ఇచ్చే పాలు) అందజేయాలని నిర్ణయించి ఆ వైపు అడుగులు వేశారు. హైబ్రిడ్‌ ఆవులు, గేదెలు ఇచ్చే పాలను ఎ1 పాలు అంటారు. ఈ పాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నిత్యం పిల్లలు ఎ1 పాలు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది.  దేశీయ ఆవులు ఇచ్చే పాలను ఎ2 పాలు అంటారు. దేశీయ ఆవు పాలు, నెయ్యి, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూర్చుతాయి.ఎదిగే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

ఆన్‌లైన్‌లోనేఆర్డర్‌..
ఆన్‌లైన్, ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే గుమ్మం ముందుకే పాలు, నెయ్యి డోర్‌ డెలివరీ చేస్తున్నారు. పాలు పితికిన కొద్ది క్షణాల్లోనే స్టీల్‌ బాటిల్స్‌లో పాలను నింపుతారు. అక్కడి నుంచి నేరుగా డోర్‌ డెలివరీ చేస్తారు. పరిశుభ్రమైన వెన్న, నెయ్యి కూడా తయారు చేస్తున్నారు. 

పిల్లల కోసం....
గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ స్ప్రింగ్స్‌ విల్లాస్‌లో నివాసం ఉండే అల్లోల దివ్యారెడ్డి దేశీయ ఆవులను పెంచాలని నిర్ణయించారు. ఎ1, ఎ2 పాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. 2015లో గుజరాత్‌ వెళ్లి పలు గోశాలలను సందర్శించారు.  సంగారెడ్డి సమీపంలో ఓల్డ్‌ ముంబాయ్‌ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫార్మ్‌లో దేశీయ ఆవులైన గిర్‌ జాతికి చెందిన 15 ఆవులతో ‘క్లిమమ్‌ వెల్‌నెస్‌ అండ్‌ ఫార్మ్స్‌’ను ప్రారంభించి సరఫరా చేయడం ప్రారంభించారు. ఉత్తమ స్పందన రావడంతో  200 గిర్‌ ఆవులను కొనుగోలు చేశారు. ఈ ఫార్మ్‌ నేడు స్టార్టప్‌గా మారింది.

అనేక అవార్డులు, ప్రశంసలు
బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌– సాక్షి ఎక్సిలెన్స్‌ అవార్డ్‌–2017   
నేషనల్‌ గోపాల రత్న–2018 అవార్డ్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా అందుకున్నారు.
ఎకో కాన్షియస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2016 అవార్డును సౌత్‌ సోకప్‌ అండ్‌ రిట్జ్‌ మ్యాగజైన్‌ అంద జేసింది.

దేశీయ ఆవుల సంతతిపెంచాలి...
అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌతాఫ్రికా లాంటి దేశాల మన దేశీయ ఆవులను పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఆవుల మల, మూత్రాలతో చేపట్టే సేంద్రీయ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దేశీయ ఆవుల సంతతిని పెంచేందుకు చాలా మందికి అవగాహన కల్పించాం.      –  అల్లోల దివ్యారెడ్డి

మరిన్ని వార్తలు