త్వరలో రుణమాఫీ అమలు చేస్తాం

20 Jul, 2019 07:45 IST|Sakshi

మండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడి ∙మున్సిపల్‌ బిల్లుకు సభ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీని త్వరలో అమలు చేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలిలో శుక్రవారం మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను సభలో ఆయన ప్రవేశపెట్టారు.  సభ్యులు వివిధ అంశాలను లేవనెత్తారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ విముక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి సమాధానం ఇచ్చారు. చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్డితో పాటు నలుగురు సభ్యులు ఉంటారని చెప్పారు. మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు వార్డుల పునర్విభజనకు సంబంధించిందని పేర్కొన్నారు. వడ్డీ రాయితీ సొమ్ము ఇవ్వకపోవడంతో రుణాలు 10 శాతం కూడా బ్యాంకులు రైతులకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు ఇప్పించాలన్నారు. 

ప్రైవేటు ఈడబ్ల్యూఎస్‌ లేదు.. 
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో అగ్రవర్ణ పేదల (ఈడ బ్ల్యూఎస్‌) రిజర్వేషన్ల అమలుకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) అనుమతి ఇవ్వలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. మండలిలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపక సిబ్బంది విరమణ వయసు పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. కాగా, మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులను మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు సభకు పరిచయం చేశారు.  

మరిన్ని వార్తలు