ప్రాజెక్టులపై పెత్తనమెవరికి?

7 Jan, 2020 03:07 IST|Sakshi

రాష్ట్రాల పరిధిలోనా.. బోర్డు చేతిలోనా?

రేపటి కృష్ణా, గోదావరి బోర్డు భేటీలో వర్కింగ్‌ మాన్యువల్‌పై కీలక చర్చ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలా? లేక రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలా అన్నది తేలే సమయం ఆసన్నమయింది. ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఇరు రాష్ట్రాల ఉద్యోగులూ బోర్డు అధీనంలోనే పని చేసేలా గతంలో రూపొందించిన వర్కింగ్‌ మాన్యువల్‌పై ఈ నెల 8న జరుగనున్న కృష్ణాబోర్డు భేటీలో కీలక చర్చ జరుగనుంది. ప్రాజెక్టుల నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు మెట్టు దిగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా ఉంది.

కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డులు ఎప్పటినుంచో కోరుతోంది. దీంతో పాటే ఇప్పటికే నీటి వినియోగం జరుగుతున్న ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామని చెబుతోంది. తమ పరిధిలో ఉంటేనే పర్యవేక్షణ సులువవుతుందని అంటోంది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి బోర్డుపెత్తనమే మేలని చెబుతూ వస్తోంది. దీంతో రేపు జరిగే భేటీ కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య 34ః66గా ఉన్న నీటి వినియోగ వాటాను 50ః50గా చేయాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు