నేటితో ముగియనున్న గడువు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీకి ఈసారి డిమాండ్ తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా చేపట్టిన రిజిస్ట్రేషన్కు 1,07,450 మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 26తో దరఖాస్తుల గడువు ముగియనుంది. శనివారం రాత్రి వరకు మరో 10 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
గతేడాది 2.20 లక్షల మంది డిగ్రీలో చేరగా ఈసారి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు ఏంటన్నది అధికారులు ఆలోచిస్తున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యే వారే ఎక్కువగా డిగ్రీలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మరో లక్ష మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. ఆ ఫలితాలు వచ్చాక మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.