డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి 

23 Jun, 2020 01:24 IST|Sakshi

డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ

జూలై 6 నుంచి వెబ్‌ ఆప్షన్లు

బయోమెట్రిక్‌ బదులు ఈసారి ఫేస్‌ రికగ్నైజేషన్‌తో రిజిస్ట్రేషన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకొనే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో( https:// dost.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌తో లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన దోస్త్‌ కమిటీ సమావేశంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కరోనా నేపథ్యంలో ఈసారి ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌కు బదులు రియల్‌టైమ్‌ డిజిటల్‌ ఫేస్‌ రికగ్నైజేషన్‌ టీ–యాప్‌ ఫోలియోను ప్రవేశపెట్టింది. ఇదీ తెలంగాణ ఇంటర్‌ బోర్డు నుంచి పాసైన విద్యార్థులకే వర్తిస్తుంది. విద్యార్థులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, సెల్ఫీ ఫొటో ద్వారా ‘దోస్త్‌’ఐడీని జనరేట్‌ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌ కోసం 7901002200 వాట్సాప్‌ చాట్‌బాత్‌ (ఆటో రెస్పాండర్‌)ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా వివరాలను పొందవచ్చు.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రధాన అంశాలు..

  • ఇదివరకే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌గల విద్యార్థులు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ కాకపోతే తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది.
  • విద్యార్థులు టీ–యాప్‌ ఫోలియో యాప్‌ (ఫేషియల్‌ రికగ్నిషన్‌) ద్వారా సెల్ఫీతోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ లేని వాళ్లు, ఆధార్‌తో మొబైల్‌ లింక్‌లేని వాళ్లు వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు తీసుకొని దోస్త్‌ హెల్త్‌లైన్‌ లేదా దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ లేదా మీసేవా సెంటర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • మొదటిసారి రిజిస్ట్రేషన్‌కు రూ. 200 చెల్లించాలి.
  • రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థికి దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబర్‌ వస్తుంది. వాటిని ఉపయోగించి దరఖాస్తు ఫారం ఓపెన్‌ చేసి వివరాలు నింపాలి.
  • ఆ తరువాత విద్యార్థులు కోర్సులవారీగా, కాలేజీలవారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 
  • మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • కోరుకున్న కాలేజీలో సీటు వస్తే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా విద్యార్థి కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి.
  • ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీట్లను కన్‌ఫర్మ్‌ చేసుకున్న విద్యార్థి ఆగస్టు 20 నుంచి 24 మధ్య కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లను సమర్పించి ఫీజు చెల్లించాలి. అప్పుడే ఆ విద్యార్థికి ఆ సీటు ఉంటుంది.
  • మొదటి కౌన్సెలింగ్‌లో విద్యార్థికి వచ్చిన సీటు, కాలేజీ నచ్చకపోయినా సీటు రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే ఫీజు చెల్లించాలి. ఆ తరువాత తదుపరి దశల కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హతగల వారు 2019 ఏప్రిల్‌ 1 లేదా ఆ తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఈ–సేవా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి.
  • యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లభించిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు డబ్బలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు రూ. 500 చెల్లించాలి.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సమయంలో రూ. 1,000 చెల్లించాలి.

ఇదీ షెడ్యూల్‌..

  • 1–7–2020 నుంచి 14–7–2020: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ (ఫీజు రూ. 200)
  • 6–7–2020 నుంచి 15–7–2020: వెబ్‌ ఆప్షన్లు
  • 13–7–2020: స్పెషల్‌ కేటగిరీ (పీహెచ్, క్యాప్‌) అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
  • 14–7–2020: ఎన్‌సీసీ, ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ (స్పెషల్‌ కేటగిరీ) వెరిఫికేషన్‌

22–7–2020: మొదటి దశ సీట్ల కేటాయింపు

  • 23–7–2020 నుంచి 27–7–2020: ఆన్‌లైన్‌లో విద్యార్థులు కాలేజీ ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం.
  • 23–7–2020 నుంచి 29–7–2020: రెండో దశ రిజిస్ట్రేషన్లు (ఫీజు రూ. 400)
  • 23–7–2020 నుంచి 30–7–2020: రెండో దశ వెబ్‌ ఆప్షన్లు
  • 29–7–2020: వర్సిటీల హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో అన్ని సెల్ఫ్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 

7–8–2020: రెండో దశ సీట్లు కేటాయింపు

  • 8–8–2020 నుంచి 12–8–2020: ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
  • 8–8–2020 నుంచి 13–8–2020: మూడో దశ రిజిస్ట్రేషన్లు (ఫీజు రూ. 400) 
  • 8–8–2020 నుంచి 14–8–2020 వరకు: మూడో దశ వెబ్‌ ఆప్షన్లు
  • 13–8–2020: యూనివర్సిటీల హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో అన్ని సెల్ఫ్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

19–8–2020: మూడో దశ సీట్లు కేటాయింపు

  • 20–8–2020 నుంచి 21–8–2020: ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
  • 20–8–2020 నుంచి 24–8–2020: అన్ని దశల్లో సీట్లు కన్‌ఫర్మ్‌ చేసుకున్న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడం
  • 24–8–2020 నుంచి 31–8–2020: కాలేజీల్లో ఓరియెంటేషన్‌ కార్యక్రమాలు
  • 1–9–2020 నుంచి: మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం  
మరిన్ని వార్తలు