9న డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌

3 May, 2019 01:31 IST|Sakshi

10వ తేదీ నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు 

76 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఈ నెల 9న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెల్లడించాక వారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని వివరించారు.

గత మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో ప్రవేశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల వల్ల హైదరాబాద్‌లోని టాప్‌ కాలేజీల్లో కూడా అన్ని జిల్లాలకు చెందిన గ్రామీణ విద్యార్థులకు సీట్లు లభించినట్లు తెలిపారు. డిగ్రీలో ప్రవేశాల కోసం మొదట ఈ–సేవా కేంద్రాల ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అయితే గతేడాది నుంచి ఈ–సేవతోపాటు ఆధార్‌ ఆధారిత మొబైల్‌ ద్వారా కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈసారి ఆ రెండు సదుపాయాలతోపాటు అన్ని జిల్లాల్లోని 76 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు.  

స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాలు: విద్యార్థులు తమ మొబైల్‌ నంబరు మార్చుకోవడంతోపాటు ఇతర మార్పు లు చేసుకునేందుకు పది పాత జిల్లా కేంద్రాల్లో స్పెషల్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీలో ప్రస్తుతం కొన్ని వర్సిటీల్లో వేర్వేరు గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున వాటిని మార్పు చేసి, అన్ని వర్సిటీల్లో ఒకే గ్రేడింగ్‌ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. అలాగే ఒకే రకమైన మూల్యాంకన విధానాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించేలా ఒకే రకమైన కోర్, ఎల క్టివ్‌ పేపర్ల అమలు వంటి చర్యలు చేపడతామన్నారు.
 

మరిన్ని వార్తలు