యురేనియం అన్వేషణ ఆపేయాలి..

17 Sep, 2019 02:55 IST|Sakshi
సోమవారం హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చెరుకు సుధాకర్, కోదండరామ్, రేవంత్‌రెడ్డి, వీహెచ్, ఉత్తమ్, పవన్, సంధ్య, నాదెండ్ల మనోహర్, చాడ వెంకటరెడ్డి తదితరులు

అఖిలపక్ష భేటీలో పర్యావరణవేత్తల డిమాండ్‌ 

పాల్గొన్న ఉత్తమ్, పవన్‌కల్యాణ్, కోదండరాం, చాడ, రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది.  

అయోమయానికి గురిచేస్తున్నారు.. 
సోమవారం దస్‌పల్లా హోటల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్‌గౌడ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్‌ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్‌ నేత వీహెచ్, మూమెంట్‌ అగెన్ట్‌ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఇమ్రాన్‌ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు