ఇంటర్‌లో మళ్లీ అప్రెంటిస్‌షిప్‌

23 Jan, 2020 03:47 IST|Sakshi

4 ఏళ్ల తర్వాత వొకేషనల్‌ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వొకేషనల్‌ కోర్సులు చదువుతున్న, ఇప్పటికే చదువుకున్న విద్యార్థులకు శుభవార్త. 4ఏళ్ల తర్వాత మళ్లీ వారి కోసం ఇంటర్‌ విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గత నాలుగేళ్ల పాటు ఇంటర్‌లో వొకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు అంప్రెటిస్‌షిప్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఏడాది కాలం అప్రెంటిస్‌షిప్‌ చేయనందున ప్రభుత్వ ఉద్యోగాలకు తాము అనర్హులం అవుతున్నామని విద్యార్థులు ఆందోళన చెందారు.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సులను రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఆర్డీఎస్‌డీఈ) పరిధిలోకి తీసుకువచ్చేలా ఇంటరీ్మడియట్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో ఇంటర్‌లో పారా మెడికల్, ఇతర సాంకేతిక విద్యా కోర్సులను చదివే విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ అవకాశం కల్పించే సంస్థలు ఆర్డీఎస్‌డీఈలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు.

ఆ కోర్సుల విద్యార్థులు కావాలి..
బుధవారం హైదరాబాద్‌లోని 46 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ విద్యార్థుల అవసరాలపై చర్చించారు. వారంతా తమకు ఫార్మా టెక్నాలజీ (పీహెచ్‌టీ), మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఎంఎల్‌టీ), ఫిజియోథెరపీ (పీటీ), మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) వంటి కోర్సులు చేసిన విద్యార్థులు కావాలని అడిగారు. అయితే ఆయా సంస్థలు ఆర్డీఎస్‌డీఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే మార్చి/ఏప్రిల్‌లో అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు