ఉపాధ్యాయుడి అవతారమెత్తిన ‘కడియం’

11 Dec, 2019 12:01 IST|Sakshi
మోడల్‌ కళాశాలలో పాఠాలు బోధిస్తున్న కడియం శ్రీహరి

సాక్షి, జఫర్‌గఢ్‌: పూర్వాశ్రమంలో ఆధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు భోదించిన  కడియం శ్రీహరి తిరిగి ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు భోదించి ఆధ్యాపకుడి అవతారమెత్తిన ఘటన మండల కేంద్రంలో మోడల్‌ కళాశాలలో చోటు చేçసుకుంది. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్‌ కళాశాలతో పాటు కస్తూర్బా పాఠశాలను కడియం శ్రీహరి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన కడియం శ్రీహరి తరగతి గదిలో ఉన్న విద్యార్థులను చూడగానే నేరుగా క్లాసు రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠం చెప్పడమే కాకుండా వారిని పలు ప్రశ్నలు అడిగారు. లోక్‌సభ, రాజ్యసభలో సభ్యుల సంఖ్యతో పాటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరంటూ ప్రశ్నించారు. వీటికి  సమాధానం చెప్పిన సుస్మిత అనే విద్యార్థినిని అభినందిస్తూ వెయ్యి రూపాయల పారితోషికాన్ని అందించారు. అనంతరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడి నుంచే మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కడియం శ్రీహరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బత్తిని రాజేందర్, డీఈ జెయాకర్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీకాంత్, సీహెచ్‌.స్వప్న, సర్పంచ్‌ నర్సింగరావు, విద్యాకమిటీ చైర్మన్‌ జయశంకర్, టీఆర్‌ఎస్‌ నాయకులు బానోత్‌ రాజేష్‌నాయక్, అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, నాయకులు కుల్లా మోహన్‌రావు, మారపల్లి ప్రభాకర్, కుల్లా నర్సింగంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు