భద్రత పునరుద్ధరణపై వివరాలివ్వండి 

26 Jun, 2018 01:26 IST|Sakshi

సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. నోటీసులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ జారీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేసినా, భద్రతను పునరుద్ధరించలేదని, తమకు గతంలో ఉన్న విధంగానే భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలను తమ ముం దుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. శాసనసభ్యత్వాల రద్దును  కోర్టు తప్పుపడుతూ, రద్దు తీర్మానాన్ని కొట్టేసిందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో తమకు 2+2 గన్‌ మెన్లు ఉండేవారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను పునరుద్ధరించడం లేదన్నారు. 

మరిన్ని వార్తలు