పోలీస్‌: ‘దండం పెడతా.. బయటకు రాకండి’

11 Apr, 2020 07:59 IST|Sakshi
దండం పెట్టి చెబుతున్న హెడ్‌కానిస్టేబుల్‌ ప్రేంసింగ్

కట్టుదిట్టమైన వలయంలో కంటైన్మెంట్‌ జోన్లు

జిల్లా కేంద్రంలో వన్‌టౌన్‌ ఏరియా పూర్తిగా దిగ్బంధం

ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ యధాతథం

లోటుపాట్లు సరిచేసేందుకు కలెక్టర్‌ విస్తృత తనిఖీలు

సాక్షి, ఇచ్చోడ(బోథ్‌): దండం పెట్టి చెబుతున్న అనవసరంగా  బయట తిరగకండి అని ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో     ప్రయాణిస్తున్న వారిని కానిస్టేబుల్‌ ప్రేంసింగ్‌ ఇలా దండం పెట్టి     వేడుకున్నాడు. 

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఆదిలాబాద్‌ అర్బన్‌ ప్రాంతం, నేరడిగొండ, ఉట్నూర్‌ మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో ఒక కిలో మీటర్‌ వరకు, మండల ప్రాంతంలో మూడు కిలో మీటర్ల రేడియస్‌లో ఈ దిగ్బంధం చేశారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వచ్చే ఏరియాను పూర్తిగా దిగ్బంధం చేశారు. 


ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో పోలీసుల బందోబస్తు

డప దాటకుండానే..
ఈ కంటైన్మెంట్‌ జోన్లలో 19,541 ఇళ్లు ఉండగా, 72,666 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో ఆదిలాబాద్‌లోనే 17,083 ఇళ్లు ఉండగా 63,587 మంది జనాభా ఉన్నారు. మిగితా ఇళ్లు, జనాభా నేరడిగొండ, ఉట్నూర్‌ మండల కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, ఇతర ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 19 వార్డులకు ఒక్కొక్క స్పెషలాఫీసర్, ఒక అసిస్టెంట్‌ను నియమించింది. వార్డుల్లో గడప గడపకు కూరగాయలు సరఫరా చేసే విధంగా కొంత మంది కూరగాయలు విక్రయించే వ్యక్తులతో ఒప్పందం చేసుకుని వారి ఫోన్‌ నంబర్లను ప్రకటించారు. 

మరో ముగ్గురికి నెగిటివ్‌...
జిల్లాలో మరో ముగ్గురికి  నెగెటివ్‌ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం వరకు 72 ఫలితాలు రాగా మరో ముగ్గురు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. ఇక ప్రైమరీ కాంటాక్ట్‌లో మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన వారికి సంబంధించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫలితాలు రావాల్సి ఉంది. ఈనెల 10వరకు జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన 11మందిని గాంధీ ఆస్పత్రికి షిఫ్ట్‌ చేశారు. నెగిటివ్‌ వచ్చిన 152 మందిని హోమ్‌ క్వారంటైన్‌కు గురువారం పంపించిన విషయం తెలిసిందే. ఇందులో మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన 65 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దేవసేన
వార్డులకు గల్లీ వారియర్స్‌
ఆదిలాబాద్‌అర్బన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని కంటైన్మెంట్‌ ఏరియాలో గల 19 వార్డుల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, పాలు, మందులు గల్లీ వారియర్స్‌ ద్వారా ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని, అన్ని వార్డులకు గల్లీ వారియర్స్‌ను నియమించాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు.టీటీడీసీలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. అవసరమైన నిత్యావసరాలు గల్లీ వారియర్స్‌ ద్వారా ఇంటికే పంపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, అదనపు ఎస్పీ వినోద్‌ కుమార్, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) డేవిడ్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌ రంజానీ, కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ ఉన్నారు. 

జిల్లాలో కరోనా వివరాలు..
మర్కజ్‌ నుంచి తిరిగి వచ్చిన వారు : 76
నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపినవి : 76
ఫలితాలు వచ్చినవి : 75  (ఈ సంఖ్యలో మూడు ఫలితాలు శుక్రవారం వచ్చినవి కలిపి) పాజిటివ్‌ : 10
నెగెటివ్‌ : 65
ఫలితాలు రావాల్సినవి : 01

ప్రైమరీ కాంటాక్ట్‌ వివరాలు..
కుటుంబ సభ్యులు, సన్నిహితుల గుర్తింపు : 116
నమూనాలు సేకరించి పంపినవి : 116
ఫలితాలు వచ్చినవి : 88
పాజిటివ్‌     : 01
నెగెటివ్‌  : 87
ఫలితాలు రావల్సినవి : 28

మరిన్ని వార్తలు