ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన, అప్గ్రేడ్ అయిన పురపాలికల్లో పాలన ఇంకా గాడిన పడలేదు. వరుస ఎన్నికలు, స్పెషలాఫీసర్ల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత వెరసి ఆయా మున్సిపాలిటీల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. పాలనాసౌలభ్యం కోసం గతేడాది ఆగస్టు 2న మేజర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు
అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు పడలేదు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కొత్త పురపాలికల్లో అభివృద్ధి పడకేసింది. సొంత, సరిపడా భవనాలు, అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో ఆయా పురపాలికల్లో పాలన గ్రామ పంచాయతీలుగా మాదిరిగానే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలుండగా.. వాటిలో మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట పాత పురపాలికలు. నగరపంచాయతీలుగా ఉన్న నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, అయిజ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన జిల్లాస్ధాయి, డివిజన్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. దీంతో ఆయా పురపాలికల్లో పాలన పరుగులు పెడుతుందని అందరూ సంతోషించారు.
అయితే కొందరు స్పెషలాఫీసర్లు తమకు కేటాయించిన మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పలువురు అధికారులు ము న్సిపల్ కార్యాలయాలకు వెళ్లినా పని చేసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పని చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టణాల అభివృద్ధి, సుందరీకరణకు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) నుంచి ప్రతి మున్సిపాలిటీకి గతేడాది రూ.15కోట్ల నిధులు మంజూరయ్యా యి. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆదాయ వనరులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అంతంత మాత్రంగా ఉండడంతో పురపాలికలు అభివృద్ధిలో వెనకబడ్డాయి. దీంతో చాలా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే కొత్త పాలకవర్గాలు కొలువుదీరితేనే గానీ ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెట్టదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనికి ఇంకా కనీసం నాలుగు నెలలైనా పట్టే అవకాశాలుండడం.. వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య తలెత్తే అవకాశాలుండడంతో అప్పటి వరకు స్పెషలాఫీసర్లు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇష్టారాజ్యం..
పలువురు స్పెషలాఫీసర్లు, మున్సిపల్ సంబంధిత విభాగాల ఇన్చార్జీలు అధికారులు సమయపాలన పాటించకపోవడం.. ఇష్టారాజ్యంతో అప్గ్రేడ్, కొత్త మున్సిపాలిటీల పరిధిలో రియల్టర్లు, వ్యాపారులతో పాటు ప్రజలు ఇష్టారాజ్యంగా ఇళ్లు, వెంచర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడి ఏడాది కావస్తున్నా.. చాలా వాటిలో వారం రోజుల వరకు వాటి పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు,జననమరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కాలేదు. ఇటీవలే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించుకున్నారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనుమతుల కోసం దరఖాస్తుల్లో సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. సగానికి పైగా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేకపోవడం గమనార్హం. దీంతో చెత్తను ఆయా పట్టణ శివారు ప్రాంతాల్లో వేయడంతో పారిశుధ్యం లోపిస్తోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గడిచిన పది నెలల్లో వార్డుల్లో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు.
మున్సిపాలిటీల్లో కొన్ని సమస్యలు
నిధులు రాలే..
కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా ఉన్నవాళ్లు అంకితభావం, పట్టుదలతో పని చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్నాం.. ఇకపై మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాములు, వడ్డేపల్లి ఇన్చార్జ్ కమిషనర్